164 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు
** జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి: భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో 164 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇంచార్జీ జాయింట్ కలెక్టర్ కమ్ నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి , డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు రోజ్మాండ్, సుధారాణిలతో పాటు తిరుపతి, శ్రీ కాళహస్తి ఆర్డిఓలు రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, నియోజక వర్గాల తహసిల్దార్లు, జిల్లాలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల సరళీకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఎస్.వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ 2025లో భాగంగా 1200 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో వాటిని గుర్తించి 164 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు తయారు చేశామని తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజక వర్గాల్లో 38 పోలింగ్ కేంద్రాలలో ప్రాంతాల మార్పు, 9 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు, 164 నూతన పోలింగ్ కేంద్రాల గుర్తింపు, 44 పోలింగ్ కేంద్రముల విలీనం చేయడం వలన జిల్లాలో గతంలో ఉన్న 2141 పోలింగ్ కేంద్రము లకు గాను 2261 పెరుగుతాయని తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల వారిని అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలుపమన్నారు.
