గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రబిందువులుగా ఉండాలన్నారు.
కమ్యూనిటీ భవనాలు గ్రామస్తుల సామాజిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని ప్రతి గ్రామంలో అవసరమైన ప్రభుత్వ భవనాలు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
