నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

TEJA NEWS

నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

సూర్యాపేట పట్టణ సన్నాహక సమావేశంలో సంకినేని వెంకటేశ్వరరావు పిలుపు

సూర్యాపేట జిల్లా ప్రతినిధి

ఈ నెల 10వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు భారీ జన సమీకరణపై చర్చించేందుకు సూర్యాపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారని, ఇవి రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు.

పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ సభ చారిత్రాత్మకంగా నిలిచేలా ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన కోరారు. సూర్యాపేట పట్టణం మరియు నియోజకవర్గ పరిధిలోని బీజేపీ శ్రేణులు, మోదీ అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ, జిల్లా నాయకులు పోలగాని ధనంజయ గౌడ్, నిమ్మల లవన్, మండల పార్టీ అధ్యక్షులు సంధ్యాల సైదులు, తాళ్లపల్లి మధు, మాధవరపు అనిల్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పేర్వాల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top