
రేడియం స్టిక్కర్ల విధానాన్ని రద్దు చేయాలి.. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కి వినతిపత్రం .
కోదాడ
రవాణా రంగంపై మోయలేని భారంగా మారినా రేడియం స్టిక్కర్ల విధానాన్ని రద్దుచేసి తమను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని కోరారు. గురువారం కోదాడ పట్టణంలో లారీ అసోసియేషన్ నాయకులతో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెయ్యి రూపాయలు విలువ చేసే రేడియం స్టిక్కర్లను ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ల పేరిట ఐదు నుంచి ఆరు వేల రూపాయలు వసూలు చేయడంతో అన్ని వాహనాల యజమానులతో పాటు ముఖ్యంగా లారీ యజమానులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. గత ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచామని గుర్తు చేశారు.
వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రేడియం స్టిక్కర్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ నాయకులు పైడిమర్రి వెంకటనారాయణ, యలమందల నరసయ్య, పెద్ది అంజయ్య, దొంగరి శ్రీను, గౌస్, చంద్రమౌళి, బాబా తదితరులు లారీ యజమానులు పాల్గొన్నారు.