
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి…
ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
పెద్దపల్లి// అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన ఏ. శ్యామల సర్వే నెంబర్ 12/ఆ/2, 47ఆ/5 లో తన భర్తకు భూమి ఉండేదని, తన భర్త మరణించినందున ఆ భూమి తన పేరు మీద విరాసత్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డిఓ పెద్దపల్లి, తహసిల్దార్ ఎలిగేడు కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పెద్దపల్లి మండలం పెద్ద కలువల గ్రామానికి చెందిన నారసాని వెంకటేష్ గ్రామంలో తనకు మీసేవ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, సంబంధిత రెవెన్యూ అధికారులకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన తిరుపతి తమ గ్రామంలో అనర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేశారని, ప్రభుత్వ ఉద్యోగులు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నవారికి రేషన్ కార్డు రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.