సూర్యాపేట రూరల్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
ఎస్పీ ఆదేశాల మేరకు NH–365B వద్ద ప్రయాణికులకు అవగాహన
సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లా ఎస్పీ కే. నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట రూరల్ పరిధిలోని NH–365B గాంధీనగర్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్ ఆధ్వర్యంలో, ఏఎస్ఐలు పాండు నాయక్, వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. “అరైవ్ అలైవ్” నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా చర్యలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐలు పాండు నాయక్, వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడితే కేంద్ర ప్రభుత్వ ‘రహవీర్’ పథకం ద్వారా రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తారని వివరించారు. అలాగే హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ… యువత తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రతా నియమాల గురించి వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు ఇరుగు బాబు, శంకర్, శ్రీధర్, చంద్రకాంత్తో పాటు పలువురు ప్రయాణికులు పాల్గొన్నారు.
