లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు
** తరిగొండలో వైభవంగా ధ్వజారోహణం
తిరుపతి / గుర్రంకొండ: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం సమీపంలోగల తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి.
ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఉత్సవమూర్తులు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 8 నుంచి 09 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కాగా, రాత్రి 08 గం.లకు హంస వాహనం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఈవో ఎం.గోపినాథ్, అర్చకులు కృష్ణ రాజన్, కృష్ణ ప్రసాద్, గోపాల్ బట్టర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
మార్చి 05 వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్, పుష్పాలంకరణలను చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
