జనగణన కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలి…
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ….
పెద్దపల్లి : జనగణన 2027 కార్యక్రమాన్ని మన పెద్దపల్లి జిల్లాలో కట్టుదిట్టంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తెలిపారు.
సోమవారం జనగణన 2027 కార్యక్రమం నిర్వహణలో భాగంగా తొలిదశలో నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ , హౌసింగ్ సెన్సెస్ సంబంధించి సంబంధిత అధికారులకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ.
అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ, జనగణన తొలి దశ పై శిక్షణ కార్యక్రమం మార్చి 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడుతుందని అన్నారు.
జనగణన కార్యక్రమం దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల నివాస గృహాల వివరాలు, మౌలిక సదుపాయాల స్థితి, కుటుంబాల వివరాలు తదితర అంశాలను ఈ దశలో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు.
జనగణన ప్రక్రియ పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి అధికారి మీద ఉందన్నారు. శిక్షణలో భాగంగా డేటా సేకరణ విధానం, డిజిటల్ పరికరాల వినియోగం, ఫీల్డ్ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కేటాయించిన అధికారులు పూర్తి స్థాయిలో శిక్షణ పొంది అవగాహన పొందాలని తెలిపారు.
జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికకు అవసరమైన ఖచ్చితమైన గణాంకాలు సిద్ధమవుతాయని పేర్కొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, మండల, మున్సిపల్, మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
