నిర్మాణాల్లో నాణ్యత తగ్గితే ఊరుకోను
– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో చేపడుతున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల్లో కమిషన్ పర్వం నడుస్తుందన్న సమాచారం అందడంతో ఆయన అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొంతమంది స్థానిక నాయకులు పనుల్లో కమిషన్ ఆశిస్తున్నారన్న సమాచారం ఆయన దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ప్రజల పన్నుల డబ్బుతో చేపడుతున్న పనుల్లో నాణ్యత తప్పనిసరిగా ఉండాలని, ప్రతి నిర్మాణపనిపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. నాణ్యత లోపాలు గమనిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, కాంట్రాక్టర్లు మరియు సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.
