
అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
స్వల్ప వర్షానికే రోడ్లపైకి మురుగునీరు
శానిటేషన్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
చిలకలూరిపేట: పట్టణంలో డ్రైనేజీ నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో కురిసిన స్వల్ప వర్షమే నిదర్శనంగా నిలిచింది. చిన్నపాటి వర్షానికే మురుగునీరు రోడ్లపైకి చేరడంతో అటు వాహనదారులు, ఇటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మురుగు నీటిలోనే ప్రయాణం
ముఖ్యంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్కు వెళ్లే ప్రధాన రహదారిలో డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లాయి. వర్షపు నీరు కాలువలో పట్టకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరి చెరువును తలపించింది. దీనివల్ల మార్కెట్కు వెళ్లే ప్రజలు, వాహనదారులు ఆ గలీజు నీటిలోనే ప్రయాణించాల్సి రావడంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శానిటేషన్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ మట్టి, వ్యర్థాలును సకాలంలో తొలగించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే, రేపు వర్షాకాలంలో మా గతేంటి?” అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఈ సమస్యలు కనబడటం లేదా అని వారు నిలదీస్తున్నారు.
మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి, తక్షణమే కాలువలను శుభ్రం చేయించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న శానిటేషన్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.