స్విమ్స్ ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ

WhatsApp Image 2026 02 14 at 6.37.28 PM
TEJA NEWS

స్విమ్స్ ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ

** డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ దాతృత్వంతో…

తిరుపతి: శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆసుపత్రికి డాలర్ చారిటబుల్ ట్రస్టు తరపున తుడా ఛైర్మన్, టి.టి.డి. బోర్డు ఎక్స్ ఆఫీషియో సభ్యుడు డాలర్స్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా స్విమ్స్ ఉద్యోగస్తులకు హెల్మెట్లు పంపిణీ చేపట్టారు. అలాగే రోగుల సహాయార్థం వీల్ చైర్స్‌ను అందించారు.
ముఖ్య అథితిగా విచ్చేసిన స్విమ్స్ సంచాలకులు డా. ఆర్.వి.కుమార్ మాట్లాడుతూ… డాలర్స్ చారిటబుల్ ట్రస్టు గత రెండు దశాబ్దలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. డాలర్స్ దివాకర్ రెడ్డి కుమార్తె గెహిని రెడ్డి జన్మదినం సందర్భంగా స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం 6 వీల్ చైర్స్, స్విమ్స్ ఉద్యోగుల కోసం దాదాపు 3 వేల హెల్మెట్లు విరాళంగా ఇవ్వడం సంతోషకరమన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు ట్రామా సెంటర్‌ని అప్ గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా కేంద్ర హైవే ఆథారిటీ సహకారంతో తిరుపతి ఎయిర్ పోర్టు దగ్గర వున్న స్విమ్స్ స్థలంలో ట్రామా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తెలియజేశారు.

స్విమ్స్ ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చిన డాలర్స్ చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి, పోలీసు, రవాణా శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ… తమ పిల్లల పుట్టిరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాయలసీమ వ్యాప్తంగా వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న స్విమ్స్ వైద్యులు, నర్సులు దేవుళ్ళతో సమానమన్నారు. వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. స్విమ్స్ సంస్థ అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తూ దేశంలోనే ఉన్నత వైద్య సంస్థల్లో ఒకటిగా ఎదుగుతోందన్నారు. స్విమ్స్‌లో అందుతున్న వైద్య సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళేందుకు డిజిటల్ మీడియా ఏర్పాటుకు సహకారం అందిస్తామన్నారు. స్విమ్స్‌కు వచ్చే రోగుల సౌకర్యార్థం బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల నుండి ఉచిత వాహన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్విమ్స్ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు విషయాన్ని కలెక్టర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


డి.ఎస్.పి. భక్తవత్సలం మాట్లాడుతూ… హెల్మెట్‌ను చట్టం కోసమో, పోలీసుల కోసమో కాకుండా మీ కుటుంబ భద్రత కోసం ధరించాలని తెలియజేశారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరికి తెలియజేయుట కోసం డాలర్ చారిటబుల్ ట్రస్టు వారు హెల్మెట్ పై అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతి రవాణా శాఖ అసిస్టెంట్ కమీషనర్ మురళి మాట్లాడుతూ…మనం చేసే తేలికపాటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నామని, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నంగా మారుతోందన్నారు. భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఈ కార్యక్రమంలో డాలర్స్ దివాకర్ రెడ్డి సతీమణి మౌనికాదేవి, కుమార్తె గెహిని రెడ్డి, రవాణా శాఖ ఇన్పెక్టర్ స్వర్ణలత, మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్, ఆర్.ఎం.ఓ.లు డా. వెంకట కోటిరెడ్డి, డా. సతీష్, స్విమ్స్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page