మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులు
…తొలి దశంలో 40-50
హైదరాబాద్ సిటీ: గ్రేటర్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వనున్నట్టు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాలకు బస్సుల ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యామని, నగరంలో కూడా తొలి దశలో 40 నుంచి 50 సంఘాలకు బస్సులు ఇస్తామన్నారు. మరో 19 రోజుల్లో మహానగర పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్ మెతె శ్రీలతారెడ్డిలతో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హెచ్-సిటీ,ఎస్ఎన్డీపీ,ఎస్ఆర్డీపీ తదితర ప్రాజెక్టులతోపాటు వివిధ విభాగాల అధికారులు నగరంలో జరుగుతోన్న అభివృద్ధి పనులు, ఇతర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నగరంలో ప్రస్తుతం 72,942 స్వయం సహాయక సంఘాలున్నాయని, వీటి సంఖ్య లక్షకు పెంచేలా..ప్రతి పేద మహిళ సంఘంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐదేళ్లపాటు పాలకమండలికి సహకరించిన అధికారులు, ప్రజలకు ఈ సందర్భంగా విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
