
ఉపాధి కల్పించడమే మొదటి ప్రాధాన్యత
** రీన్యూ ఎనర్జీ
శంఖుస్థాపనలో సీఎం చంద్రబాబు
తిరుపతి / విశాఖపట్నం: యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించడమే మొదటి ప్రాధాన్యతగా పాలన సాగిస్తున్నట్టు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో “రీన్యూ ఎనర్జీ గ్లోబల్” ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్రాజెక్ట్ 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం ఉంటుందన్నారు. సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. మరో 24 నెలల్లో ఈ ప్లాంటు ఉత్పత్తిని ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.