గుడ్డి కేంద్రమా గ్యాస్ ఎక్కడ..? కళ్లకు నల్లనిగంతలతో వినూత్న సిపిఐ నిరసన
యుద్ధం పేరుతో పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్
వనపర్తి ‘:
దేశంలో గ్యాస్ కొరతతో ప్రతి చోట ఖాళీ సిలిండర్ల క్యూ లైన్లు కనిపిస్తున్నా గ్యాస్ కొరతలేదని కేంద్రం చెబుతోందని, గుడ్డి ప్రభుత్వమా కళ్ళు తెరిచి నిజం చూడాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా, గ్యాస్ కొరత లేదని బుకాయిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కళ్ళకు నల్లని గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణాలు పల్లెల్లో గ్యాస్ లేక ప్రజలు అల్లాడి పోతున్నారన్నారనీ గ్యాస్ బుక్ చేస్తే బుక్ కావడం లేదనీ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తే అక్కడ క్యూ లైన్లు కనిపిస్తున్నాయన్నారు. గ్యాస్ లేకపోవడంతో కట్టెలతో వంటలు చేస్తున్నారని కొందరు ఎలక్ట్రిక్ స్టవ్ లను కొంటున్నారన్నారు. వంట చెరకు కూడా రేటు పెరిగిందన్నారు. హోటల్లు మేస్ లు కళాశాల క్యాంటీన్లు పలు వ్యాపార సముదాయాలు గ్యాస్ లేక మూతపడ్డాయనీ అన్నారు. కొన్నిచోట్ల టీ కొట్టు కూడా బంద్ అయ్యాయి అన్నారు.
ఇంతటి ఇబ్బందికర పరిస్థితి కల్పిస్తున్న గ్యాస్ కు కొర తలేదని బుకాయించటం దారుణమన్నారు. వంట గ్యాస్ సిలిండర్ కు రూ. 60, వాణిజ్య సిలిండర్ కు రూ. 115 పెంచిందని, ఆ ధరకు కూడా దొరకటం లేదన్నారు. యుద్ధం పేరుతో పెంపును తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం వారి భూభాగాలను ఆక్రమించి ముడి చమురు నిక్షేపాలను కొల్లగొట్టేందుకేనని విమర్శించారు. కేంద్రం అమెరికా ట్రంప్ కు లొంగిపోయిందన్నారు. యుద్ధం ప్రభావం తో అన్ని నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉందన్నారు. భయంకర దాడులతో 1900 మంది మరణించారని 20,000 మంది గాయపడ్డారని వాతావరణం కాలుష్యమై ప్రజలు రోగాల బారిన పడుతున్న అమెరికా ఇజ్రాయిల్ దాడులను నరేంద్ర మోడీ ఖండించడం లేదన్నారు. ఈ వైఖరి దారుణమన్నారు. ఇండియా స్వతంత్రతను నరేంద్ర మోడీ ట్రంప్ కు తాకట్టు పెట్టారన్నారు. అమెరికా దయ పై నెల రోజులు రష్యా సమురు ఇండియా కొనాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కేంద్రం వైఫల్యమే కారణమన్నారు. వెంటనే యుద్ధం ఉపసంహరించాలని గ్యాస్ ధరలను తగ్గించాలని, కొరత లేకుండా చూడాలని లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కళావతమ్మ, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి , పట్టణ కన్వీనర్ జయమ్మ,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వినాదం, డిహెచ్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శేఖర్, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, శిరీష, జ్యోతి, రూప, సాయి లీల, వెంకటమ్మ, సుప్రియ,కురుమూర్తి, కృష్ణ,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
