కపిలేశ్వరాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు
తిరుపతి: టీటీడీకి చెందిన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నుంచి శాస్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, అభిషేకం, అలంకారం, అర్చన, నివేదన చేపట్టారు. ఉదయం 09 – 10గం.ల వరకు పంచమూర్తుల ఉచ్చవర్లకు స్నపన తిరుమంజనం, అలంకారం నిర్వహించారు. సాయంత్రం కలశ స్థాపనం, కలశ పూజ, అగ్ని కార్యం, హోమం, లఘు పూర్ణాహూతి, గ్రంధి పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. కాగా 08న (నేడు) ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేపడతారు. 09న(రేపు) ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
