జనవరి 12నప్రధాని మోదీ ఎదుట ‘ఐడియా’ ఆవిష్కరణ.. వనపర్తి విద్యార్థికి అరుదైన అవకాశం
వనపర్తి :
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డയలాగ్ (VBYLD) – 2026’ లో పాల్గొని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎదుట తమ వినూత్న ఆలోచనను ప్రదర్శించేందుకు వనపర్తికి చెందిన విద్యార్థి ఎం. నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు.
వనపర్తి పట్టణంలోని వెంగళరావు కాలనీకి చెందిన నితీష్ కుమార్ రెడ్డి, స్థానిక చాణక్య హైస్కూల్ లో విద్యాభ్యాసం పూర్తిచేసి, ప్రస్తుతం కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో బీసీఏ (BCA) ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.
జనవరి 9 నుంచి 12 వరకు న్యూఢిల్లీలో జరిగే ఈ జాతీయ స్థాయి సదస్సులో నితీష్, తన సహాధ్యాయిని శ్రీలక్ష్మి నాయర్ (బీకామ్)తో కలిసి పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పోటీపడగా, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కొద్దిమందిలో నితీష్ బృందం చోటు దక్కించుకోవడం విశేషం.
ప్రాజెక్ట్ వివరాలు:
పెరుగుతున్న సైబర్ నేరాల నుండి, ముఖ్యంగా వృద్ధులను కాపాడేందుకు ‘విశ్వాస్-వలయ్’ (Vishwaas-Valay) అనే స్మార్ట్ పరికరాన్ని వీరు రూపొందించారు.
ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ.. “నా కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం, స్ఫూర్తితోనే ఈ విజయం సాధ్యమైంది. జాతీయ స్థాయిలో మన జిల్లా పేరు నిలబెట్టడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.
జిల్లా విద్యార్థి జాతీయ స్థాయిలో రాణించి, ప్రధానిని కలిసే అవకాశం దక్కించుకోవడం పట్ల పలువురు విద్యావేత్తలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
