
తిరుమలలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
** సీఎంతో కలసి పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్
తిరుమల: తిరుమలలో భక్తుల కోసం అత్యాధునిక ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను తీసుకువచ్చే దిశగా ఏర్పాటు చేసిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీఎంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బి.ఆర్) నాయుడు, ఇతర ప్రముఖులతో తుడా ఛైర్మన్ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని పుణ్యక్షేత్రాల్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్, సుమారు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ₹25 కోట్ల వ్యయంతో నిర్మించబడింది.
ఇందులో దాదాపు ₹10 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయగా, ఒకే నమూనాపై 50కు పైగా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఈ ల్యాబ్కు ఉంది. శ్రీవారి ప్రసాదాల నాణ్యత, స్వచ్ఛతను నిర్ధారించడంతో పాటు ముడిసరకుల్లో జరిగే కల్తీని గుర్తించి, భక్తులకు ఉత్తమ ప్రమాణాల ప్రసాదాలు అందేలా ఈ ల్యాబ్ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.
భక్తుల విశ్వాసానికి భరోసా కలిగించే విధంగా, సాంకేతికతతో కూడిన ఇలాంటి సదుపాయాలు తిరుమలలో ఏర్పాటు కావడం గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.