జర్నలిస్టుల పాదయాత్రను జయప్రదం చేయాలి.
టీఎస్ జేఏ అధ్యక్షులు కందుకూరి యాదగిరి
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలో పక్కా ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TSJA) ఆధ్వర్యంలో జనవరి 5 తారీకు సూర్యాపేట జిల్లా కేంద్రం కోర్టు భవనము నుండి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించబోయే పాదయాత్రను జయప్రదం చేయాలని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అసోసియేషన్ నాయకులతో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు నిలువ నీడ లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాత మిర్చి యార్డులో ప్రెస్ క్లబ్ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న తమ పాదయాత్రకు ఇతర జర్నలిస్టు యూనియన్లు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలు పరిష్కరించుకునేందుకు యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుస్స చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుంటి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు దేశ గాని వెంకట్ గౌడ్, సూర్యాపేట నియోజకవర్గం నాయకులు తప్సి అనిల్, అసోసియేషన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
