జగన్కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్.. నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు రెడీ..!
అమరావతి/ వార్తా ప్రపంచం : వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. ఒకవేళ జగన్ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలన్నారు.
ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్కు కొత్తేమీ కాదన్నారు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ జగన్ నారా లోకేష్పై తీవ్ర ఆరోపణ చేశారు. జగన్ ఆరోపణలపై స్పందించిన మంత్రి లోకేష్ ఛాలెంజ్కు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.
ఏం చేశామో మళ్లీ చెబుతున్నా..
‘నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాలేదు. ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం.
కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది’ అంటూ మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు.
