కార్పొరేషన్ లో “ఒక్క రూపాయి దహన సంస్కారాలు” పునరుద్ధరించండి….
సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య మేయర్ కి వినతి…
పెద్దపల్లి / రామగుండం కార్పొరేషన్ లో గతంలో ఒక్క రూపాయికే దహన సంస్కారాల ఏర్పాట్లు కార్పొరేషన్ వారే నిర్వహించేది కానీ గత రెండు సంవత్సరాలుగా అట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని, నూతన పాలకవర్గం ఏర్పడినందున “ఒక్క రూపాయితో దహన సంస్కారాల కార్యక్రమాలు” మళ్లీ పునరుద్ధరించాలని మేయర్ మహంకాళి స్వామి కి సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య విజ్ఞప్తి చేశారు.
అనంతరం సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ.. రామగుండం కార్పొరేషన్ లోని పేద దళిత బహుజన ప్రజలు వారికి సంబంధించిన వారు మరణించినప్పుడు ఒక్క రూపాయితో జరిగే దహన సంస్కారాల కార్యక్రమంతో కొంత చేయూత లభించేదని, ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ఈ కార్యక్రమం ద్వారా కార్పొరేషన్ సహాయం చేసేదని, కానీ గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ లేకపోవడం వల్ల చాలామంది పేదలు మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందికి గురవుతున్నారని వారన్నారు.
పేద ప్రజల మన్ననలతో మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన మహంకాళి స్వామి కార్పొరేషన్ లో కొంత బడ్జెట్ కేటాయించి దహన సంస్కారాల కార్యక్రమాలను మళ్లీ పునరుద్ధరించాలని సూర్య కోరారు. ఈ విషయంలో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ కార్యక్రమానికి బడ్జెట్ కేటాయించే విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు.
