గుమ్మడిదలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి..
నూతన మున్సిపల్ పాలకవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్చెరు: ప్రతిపక్షంలో ఉన్నప్పటికిని ప్రజలు ఎంతో నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గుమ్మడిదల మున్సిపాలిటీని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నూతన పాలకవర్గానికి సూచించారు.
బుధవారం గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులకు శాలువాలు కప్పి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సిఎస్ఆర్ నిధులు కేటాయించి అభివృద్ధిని పరుగులు పెట్టిద్దామని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. అతి త్వరలో గుమ్మడిదలలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
