విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నేడు (2026 ఫిబ్రవరి 23 ఈరోజు ఫాల్గుణ శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని విశేష కార్యక్రమాలు నిర్వహించారు.
కళ్యాణ మహోత్సవం వివరాలు:
ప్రతి నెల వచ్చు షష్ఠి తిథి సందర్భంగా మహా మండపంలోని 7వ అంతస్తులో గల కళావేదిక వద్ద వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, లోక కల్యాణార్థం క్రతువును పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) స్వయంగా పాల్గొని స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ఈ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం మహా మండపంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు.
