కర్ణాటక రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
కర్ణాటక ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు ప్రకటించింది.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య శాసన సభలో 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఈ ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ..’పిల్లలకు సోషల్ మీడియా ఒక వ్యసనంలా మారుతోంది. దీంతో మానసిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒంటరిగా ఉండేందుకే ఆసక్తి చూపిస్తున్నారు, తల్లిదండ్రులతో సమయాన్ని గడప లేకపోతున్నారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం అని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది’ అని అన్నారు. సీఎం సిద్దరామయ్య కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది 17వసారి. రాష్ట్రంలో ఎక్కువ సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేతగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు
