వకుళామాత ఆలయ తృతీయ వార్షికోత్సవం
** రోజంతా ప్రత్యేక కార్యక్రమాలు
తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతికి 5కి.మీల దూరంలోని పేరూరు బండ కొండపై వెలసిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తల్లి అయిన శ్రీ వకుళామాత ఆలయం తృతీయ వార్షికోత్సవం శుక్రవారం (నేడు) నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. తిరుపతి సమీపాన పేరూరు బండపై శ్రీ వకుళామాత ఆలయం విరాజిల్లుతోంది. శ్రీనివాసుని దివ్యానుగ్రహం, భక్తుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానములు సువర్ణ శోభితమైన దివ్యవిమాన రాజగోపురములతో కూడిన సుందరమైన ఆలయంను నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీవారి ఆజ్ఞ మేరకు శ్రీవారికి నిత్యోత్సవాది కైంకర్యములను నిర్వహించే శ్రీ వేఖానస భగవచ్ఛాస్త్రోక్త విధిగా సంప్రోక్షణాది కార్యక్రమములు నిర్వహించి భక్త జనులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఇందుకు భక్తులకు సకల సౌకర్యములు కల్పించినారు. అనతి కాలంలోనే అమ్మవారి అనుగ్రహము వలన తమ అభీష్టసిద్ధి పొందిన భక్తులు విశేష సంఖ్యలో విచ్చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా జరగనున్న కార్యక్రమాలు ఇలా ఉన్నాయి….శుక్రవారం ఉదయం 5.30 – 6 గం.ల మధ్య సుప్రభాతం, ఉదయం 6 – 8 గం.ల మధ్య నిత్యకైంకర్యాలు, మూలవర్లకు అభిషేకం, అలంకారం, నివేదన, ఉదయం 09 -11 గం.ల మధ్య విష్వక్సేనారాధన, పుణ్యాహవచనము, అంకురార్పణం, మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 11 – 12 గం.ల మధ్య ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతకలశాభిషేకము చేపడుతారు.
