
సూర్యాపేటలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి: ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం సూచించారు. నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద Arrive – Alive అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లకు రహదారి భద్రతపై ముఖ్య సూచనలు అందించారు. ముఖ్యంగా లేన్ డిసిప్లిన్ (Lane Discipline) పాటించడం, అతివేగం (Over Speeding) నివారించడం, అలాగే ఎడమవైపు నుండి ఓవర్టేక్ చేయకూడదనే (No Left Overtaking) నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణ భద్రత కోసమే ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందరూ సహకరించాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు కోరారు.