యూపీ అసెంబ్లీ స్పీకర్ కు “తుడ” చైర్మన్ స్వాగతం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఉదయం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా దర్శించుకున్నారు. ఆయనకు”తుడ” చైర్మన్ అండ్ టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి సాదర స్వాగతం పలికి, దగ్గరుండి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. తిరుమలకు చేరుకున్న యూపీ స్పీకర్, డాలర్స్ దివాకర్ ఇద్దరు నేతలు కాసేపు ఆధ్యాత్మిక… అభివృద్ధి అంశాలపై చర్చించుకున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన నేతలు, శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
దర్శనానంతరం సతీష్ మహానా మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ “ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ వంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులు తిరుమల క్షేత్రాన్ని సందర్శించడం సంతోషదాయకం. వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాం,” అని తెలిపారు.
