
టేకుమట్లలో గుర్తుతెలియని వ్యక్తులు తాటి చెట్లు నరికి విధ్వంసం
దోషులను వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలి: బాధితుల డిమాండ్
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూపతి శ్రీనాథ్ గౌడ్ తండ్రి చంద్రయ్యకు చెందిన 206/8, 207/2 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 3 ఎకరాల 20 గుంటల భూమిలో పెరిగిన ఐదు తాటి చెట్లను బుధవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కటింగ్ మిషన్ సాయంతో నరికి నేలమట్టం చేశారు. ఈ తాటి చెట్లపై ఆధారపడి అదే గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బంటు శంకర్ రోజువారీ జీవనం సాగిస్తున్నాడు. చెట్లను ఉద్దేశపూర్వకంగా నరికివేయడంతో అతని ఉపాధికి తీవ్రమైన నష్టం కలిగింది. ఉదయం ఈ ఘటనను గమనించిన బంటు శంకర్ తీవ్ర ఆవేదనకు గురై, భూమి యజమాని భూపతి శ్రీనాథ్కు సమాచారం అందించాడు.
వెంటనే పొలం వద్దకు చేరుకున్న శ్రీనాథ్ గౌడ్ చెట్లను యంత్రాలతో కోసి నేలమట్టం చేసిన దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి సమయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం గ్రామంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్దోషులైన గీతాకార్మికుల జీవనాధారాన్ని నాశనం చేసిన దుండగులను తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.