
అకాల వర్షాల నష్టం, తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం…
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: అంతర్గాం, రామగుండం నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడంతో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అంతర్గాం మండలంలోని అంతర్గాం టి టి ఎస్, పొట్యాల, మద్దిర్యాల, సోమనపల్లి, బ్రాహ్మణపల్లి, కుక్కల గూడూరు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు నమోదు చేసి, రైతులకు తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి నష్టాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.