విద్యార్థుల్లో మానవ విలువలు పెంపునకే ”సద్గమయ”
** అధికారులతో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం
తిరుపతి: దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులలో హిందూ సనాతన ధర్మం బోధించి నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో టీటీడీ త్వరలో సద్గమయ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుందని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో సాయంత్రం జేఈఓ వీరబ్రహ్మం అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల్లో సహనం, సానుభూతి, నిజాయితీ, కరుణ, విశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ వంటి అంశాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండే అంశాలను
శిక్షణ షెడ్యూల్లో చేర్చాలని ఆయన ఆదేశించారు. ముందుగా హెచ్ డి పీపీ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ప్రధాన అంశాలను వివరించారు. విద్యార్థులలో నైతికత, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవ, నైపుణ్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల ప్రేమ- ఆప్యాయత- కృతజ్ఞత, కరుణ, సమగ్రతలను పెంపొందించడం ద్వారా విద్యార్థులను దేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని వివరించారు. ఈ కార్యక్రమం మొదటగా టిటిడి పాఠశాలల విద్యార్థులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆల్ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి రాజ గోపాల్, ఎస్ఈ మనోహరం, డిఈవో వెంకట సునీల్, వీజీవో సదాలక్ష్మి, సిఎంవో డాక్టర్ నర్మద, అదనపు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్, డిఈ ఎలక్ట్రికల్ సరస్వతి, ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
